సైక్లింగ్ తో శారీరక దృఢత్వంతో పాటు పర్యావరణ హితం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

0
44
టూరిజం డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి

సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు పర్యావరణ హితం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 23 నుండి 27 వరకు జిల్లా పర్యాటక శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం నాడు స్థానిక జూనియర్ కాలేజీ నుండి సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించబడింది.

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…

సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం చేకూరుతుందని, అంతే కాకుండా పర్యావరణ హితానికి పాటు పడినట్లు అవుతుందని, ముఖ్యంగా పిల్లలకు వారి తల్లిదండ్రులు పర్యాటక ప్రాంతాలను చూపించడంతో పాటు వీడియో గేముల వంటి వాటిలో మునిగిపోనివ్వకుండా ఇలాంటి సైక్లింగ్, భౌతిక క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు.

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ, యువకులతో పాటు పోటీపడుతూ 60, 70 ఏళ్ల వృద్ధులు ఈ కార్యక్రమానికి రావడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు.

జిల్లా పర్యాటక శాఖ, జిల్లా యువజన సంక శాఖ అధికారి ధనుంజయ మాట్లాడుతూ, ఎప్పుడూ ఒకే చోట ఉంటే జీవితానికి ఎటువంటి అనుభూతి ఉండదని, నాలుగు ప్రదేశాలు తిరగాలని, ఆయా ప్రదేశాల ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని, వివిధ ప్రాంతాల్లో జీవనశైలి తెలుసుకోవాలని అంటూ, రేపు 25వ తేదీ శనివారం రోజున స్వచ్ఛ పక్వాడా, 27వ తేదీ సోమవారం రోజున భువనగిరి కోట వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

100 సైకిళ్లతో సైక్లింగ్ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుండి భువనగిరి ఖిల్లా వరకు జరిగింది.

సైక్లింగ్ లో జిల్లా అధికారులు, శ్రీ బాలాజీ, అంజయ్య, వినోద్, జయ శ్రీ, కృష్ణా రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శాంతి ట్రాక్ సభ్యులు శ్రీనివాస్, పాండురంగం, అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు గోపాల్, పీఈటీలు, రాక్ క్లైంబింగ్ కోచ్ లు, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు, యువజన నాయకులు, యువకులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, జిల్లా యువజన సంక్షేమ శాఖ సిబ్బంది ఉత్సాహంగా సైక్లింగ్ లో పాల్గొన్నారు.