భోజనం ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. ఆహారానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నిజానికి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడి వుంది. కానీ, ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.. ఆ నియమాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
- ఉదయంపూట అల్పాహారం తీసుకోవాలి. కానీ, ఎక్కువగా తినకూడదు.
- ఆకలి ఎంత వేస్తే అందులో సగభాగం మాత్రమే ఆహారం తీసుకోవాలి. 1/4వంతు భాగంలో నీటిని సేవించాలి. మిగిలిన 1/4వంతు ఖాళీగా ఉంచాలి.
- భోజనానికి ముందు, తర్వాత నీటిని సేవిస్తే జీర్ణక్రియలో మార్పులు సంభవించి జీర్ణక్రియ శక్తి తగ్గుతుంది.
- భోజనానంతరం అరగంట తర్వాత మాత్రమే నీటిని కడుపారా త్రాగండి. మధ్యలో నీళ్ళు తాగాలనిపిస్తే కాసింత నీటిని సేవించాలి.
- భోజనంలో పప్పు దినుసులు, ఆకుకూరలు, పెరుగు, సలాడ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
- భోజనం చేసేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీంతో భోజనం ద్వారా లభించే పోషక తత్వాలు శరీరానికి త్వరితగతిన చేరుతాయి.
- ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమై అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భోజనానికి ఓ ప్రణాళికను రూపొందించుకుని, దాన్ని క్రమం తప్పకుండా పాటించేందుకు ప్రయత్నించాలి. అపుడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.