Highlights
- కొత్త ఏడాదిలో ఇస్రో తొలి విజయం నమోదు చేసింది.
- వరస విజయాలు ఇస్తున్న ఉత్సాహంతో మరో విజయం సాధించింది.
- విద్యార్థులు రూపొందించిన కలాంశాట్తో పాటు మిలటరీకి సేవలు అందించే మైక్రోశాట్ ఆర్ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి చేర్చింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో గ‘ఘన’ విజయం సాధించింది. వరస విజయాలు ఇస్తున్న ఉత్సాహంతో కొత్త ఏడాదిలో తొలి విజయం నమోదు చేసింది. పోలార్ ఉపగ్రహ వాహకనౌక ‘పీఎస్ఎల్వీ-సీ44’ను విజయవంతంగా నింగిలోకి చేర్చింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి గురువారం (జనవరి 24) అర్ధరాత్రి 11.37 గంటలకు పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహక నౌక ద్వారా మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహాలతో పాటు విద్యార్థులు రూపకల్పన చేసిన కలాం శాట్ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 46వ ప్రయోగం కావడం విశేషం.
2019లో చేసిన మొట్టమొదటి ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్తో పాటు శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. మైక్రోశాట్ ఉపగ్రహం బరువు 700 కిలోలు. విద్యార్థులు రూపకల్పన చేసిన కలాం శాట్ బరువు 1.2 కిలోలు. దీనికి రూ.12 లక్షల వరకు ఖర్చు చేశారు. దీని కాల వ్యవధి 2 నెలలు. పీఎస్ఎల్వీ-సీ44 ప్రయోగానికి 28 గంటల కౌంట్డౌన్ ప్రక్రియ బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైంది.
ఇప్పటివరకు భారీ ఉపగ్రహాల్ని నింగిలోకి పంపడానికి పీఎల్ఎల్వీ-ఎక్స్ఎల్ తరహాలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగించేవారు. ఈసారి మాత్రం రెండు స్ట్రాపాన్ బూస్టర్లతోనే ప్రయోగం చేయడం విశేషం. పీఎస్ఎల్వీ- సీ44 ప్రయోగంలో బరువును తగ్గించి, పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి నాలుగో దశలో అల్యూమినియం ట్యాంక్ను వినియోగించడం మరో విశేషం.
మైక్రోశాట్-ఆర్ (ఇమేజింగ్ శాటిలైట్) ఉపగ్రహం దేశ రక్షణ రంగం కోసం సేవలు అందించనుంది. ప్రయోగించిన 13 నిమిషాల అనంతరం 277 కిలోమీటర్ల ఎత్తులో మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహం వాహకనౌక నుంచి విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో అధిపతి డాక్టర్ శివన్ గురువారం ఉదయమే షార్కు చేరుకున్నారు.