మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో జమునా హేచరీస్ సంస్థకు సంబంధించిన భూ వివాదంలో చట్టప్రకారం నియమాలు, నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం ఆదేశాలు చేయడం, చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు, సర్వే చేసే అధికారులు ముందుగా నోటీసులను జారీ చేశారా అని ప్రశ్నించి ఆ కాపీలను చూపించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని హైకోర్టు బెంచ్ నిలదీసింది. అధికారుల మాటలపై తమకు నమ్మకం లేదని, అందువల్ల లిఖితపూర్వకంగా వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
అసైన్డ్ భూముల ఆక్రమణ విషయంలో అధికారులు ఫీల్డు మీదకు వెళ్ళారా లేక కారులోనే కూర్చుని నివేదికను తయారుచేశారా అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 18 ఎకరాల భూమిని సర్వే చేయడానికి రెండు రోజులు పడుతుందంటూ ఒకవైపు అధికారులు చెప్తూనే 128 ఎకరాల భూమిని ఒక్క రోజులోనే ఎలా సర్వే చేయగలిగారని ప్రశ్నించింది.
జమునా హేచరీస్ దాఖలు చేసిన పిటిషన్ తరఫున న్యాయవాది దేశాయ్ ప్రకాష్రెడ్డి వాదిస్తూ, సీఎం ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని, 24 గంటల వ్యవధిలోనే కలెక్టర్ నివేదికను సమర్పించారని, 66 కరాల అసైన్డ్ భూమి విషయంలో అక్రమాలు జరిగాయంటూ కలెక్టర్ ఆ నివేదికలో పేర్కొన్నారని, ఏ నోటీసులు ఇవ్వకు,డా ఆ భూముల్లోకి ఎలా వెళ్తారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.
రెవెన్యూ, విజిలెన్స్ సిబ్బంది కంటే ముందే మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళారని, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని న్యాయవాది వాదించారు. ఎంక్వయిరీకి సంబంధించిన నోటీసులే కాకుండా 24 గంటల్లో దర్యాప్తును పూర్తి చేసి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదిక కాపీ కూడా అందలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున వివరాలను భోజన విరామం అనంతరం ఇవ్వాల్సిందిగా అడ్వొకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించి విచారణను వాయిదా వేసంది.