Covid: మూడో దశ ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించాలి… హైకోర్టు
హైదరాబాద్… తెలంగాణ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాల్లో జనం గుమిగూడకుండా చూడాలని.. ఏ ఉత్సవంలోనూ జనసమూహాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు జారీ చేసింది. కొవిడ్ సమయంలో పాటించాల్సిన ఆంక్షలు, నిబంధనలు వీలైనంత ముందుగానే ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేసింది. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించింది. ఇతర రాష్ట్రాల మాదిరిగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివిటీ రేటు, చికిత్సల ఆధారంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించింది. సీరో సర్వైలెన్స్, కరోనాపై ఏర్పాటైన కమిటీ అధ్యయన వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.