కోవిడ్-19 టీకాలో ఒకటైన కోవిషీల్డ్ ధరను తగ్గిస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ అధినేత అధర్ పూనావాలా ప్రకటించారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాలకు మాత్రమే ఈ ధరను తగ్గిస్తున్నట్లు అధర్ వెల్లడించారు. తగ్గింపు ధరలు ఇప్పటికిప్పుడే అందుబాటులోకి వస్తాయని ప్రకటించిన ఆయన.. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం ఆదా అవ్వడమే కాకుండా మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ విషయమై బుధవారం అధర్ ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘ సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ఒక పరోపకారం తెలియజేస్తున్నాను. రాష్ట్రాలకు అందించే టీకా ధరను 400 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గిస్తున్నాము. తగ్గించిన ఈ ధర ఇప్పటి నుంచే అందుబాటులోకి వస్తుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలకు వేల కోట్ల డబ్బు ఆదాయం మిగులుతుంది. అంతే కాకుండా మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుంది’’ అని రాసుకొచ్చారు.
సీరం ఇనిస్టిట్యూ విడుదల చేసిన కోవిషీల్డ్ టీకాను మూడు ధరల్లో విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాకు రూ.400, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు రూ.600కు అమ్ముతున్నారు. అయితే ఈ విషయమై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగుతోంది. ఒకే టీకాను ఇలా వేరు వేరు ధరలకు అమ్మడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మే ధరల్లో వ్యత్యాసం పట్ల పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై, సీరం ఇనిస్టిట్యూట్పై ఒత్తిడి పెరగడంతో ధర తగ్గించక తప్పలేదని అంటున్నారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించే టీకా ధరలు మాత్రమే తగ్గించడం విశేషం.