coronavaccine:
న్యూదిల్లీ… ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులపై గురువారం కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహాకారం, ఔషధాల లభ్యతలపై ప్రధానంగా చర్చించారు. దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే కొద్ది నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి రోడ్మ్యాప్పైనా చర్చ జరిపారు.
ఇప్పటివరకూ రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేసినట్లు అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. 45 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన జనాభాలో 31శాతం మందికి తొలి మోతాదు టీకా ఇచ్చారని అధికారులు ప్రధానికి తెలిపారు. ఈ సందర్భంగా టీకా వృథాపై రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితిని మోదీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉన్నప్పటికీ పౌరులు టీకా పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీకా ప్రక్రియలో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల కోసం మళ్లించకూడదని సూచించారు. కొవిడ్ చికిత్సలో అత్యవసరమైన రెమ్డెసివర్తో సహా దేశంలో ఔషధాల కొరతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్ష్ వర్ధన్, పీయూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.