:
హైదరాబాద్: తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 19 ఏళ్ల తెరాస అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు.
‘‘అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు. అప్పుడు కేసీఆర్ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా. ప్రగతి భవన్ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పా. నన్ను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న మంత్రి హరీశ్రావుకు అవమానం జరిగింది. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారైనా ఉన్నారా? ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. నల్గొండ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు’’ అని ఈటల వ్యాఖ్యానించారు..
