యాదాద్రి నుంచి కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. యాదాద్రిలో వచ్చే ఏడాది మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ నిర్వహిస్తామని తెలిపారు. అంతకంటే 8 రోజులు ముందు నుంచి 6 వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం చేస్తామన్నారు. విద్వత్ సభ ఈ తేదీలను ఖరారు చేసిందన్నారు.


స్వామి వారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తామన్నారు. అందుకోసం 125 కిలోల బంగారం అవసరమని తెలిపారు. తమ కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం విరాళంగా ఇస్తానని సీఎం తెలిపారు. అలాగే మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కిలో బంగారం, ఎమ్మెల్యే మర్ర జనార్థన్ రెడ్డి రెండు కిలోల బంగారం విరాళంగా ఇస్తారన్నారు.
28.3.2022 తేదీన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభం
28.3.2022 తేదీన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.
మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
28.3.2022 తేదీన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంరక్షణ ప్రారంభం అవుతుందని, దానికి ముందు ఎనిమిది రోజుల ముందు 21వ తేదీన మహా సుదర్శన యాగంతో ప్రారంభమవుతుందని తెలిపారు.
స్వయంభువుగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈ విషయాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమైక్య పాలనలో అన్ని రంగాలలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, ఆధ్యాత్మిక విషయంలో నిరాదరణకు గురి అయిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గోదావరి, కృష్ణ, ప్రాణహిత నదులలో పుష్కర ఘాట్ లను ఏర్పాటు చేసుకుని, మంత్రులు వాలంటీర్లుగా పనిచేసి పుష్కర శోభను ప్రపంచానికి పరిచయం చేశాలని తెలిపారు.

గొప్ప సాంస్కృతిక చరిత్ర కలిగిన తెలంగాణ మనది. ఆధ్యాత్మిక రంగంలో గొప్పది. దాని పరిమళాలు నూతన చరిత్రకారులు వెలికి తీస్తున్నారని అన్నారు.
మహా ఉత్క్రుష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని నేను 50 ఏళ్ల కింద మెట్ల మార్గం ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకున్నానని అన్నారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణ అని,
అష్టాదశ పీఠాలలో భాగంగా మన తెలంగాణలో జోగులాంబ దేవాలయం శక్తిపీఠమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పుష్కర రూపంలో సుసంపన్నం చేశామని అన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ కిషన్ రావు తెలంగాణ బిడ్డ అని , మన శిల్పారామం సృష్టికర్త అని, అలాంటి వారి ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్రం చక్కగా ఆవిష్కృతం అవుతున్నదని, తిరుమల మాదిరిగానే మన రాష్ట్ర ప్రజలు యాదాద్రి ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారని, ప్రారంభం మన చేతుల్లో ఉండదని, చాలా పద్ధతులలో చేయాల్సి ఉంటుందని, ఈ ఆలయ వైభవం నలుమూలలా చాటే కార్యక్రమంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి వైష్ణవ సాంప్రదాయం సూచనల మేరకు పరిశీలించడం జరిగిందని తెలిపారు. కాలేశ్వరంలో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ నృసింహస్వామి రిజర్వాయర్ గా పిలవడం జరుగుతుందని, ప్రతిరోజు గోదావరి జలాలతో లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాలను దర్శించుకోవడం మన అదృష్టం అని, అలాగే ఆలేరు, భువనగిరి, రామన్నపేట, నకిరేకల్ సంబంధించి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇది స్వామి వారి దీవెన అని, 1000 ఎకరాలలో టెంపుల్ సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి , ముఖ్యమంత్రులు, గవర్నర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా వసతి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు

. అలాగే 1000 సూట్లతో 250 కాటేజీల నిర్మాణం చేపడుతున్నట్లు, త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం జియ్యర్ గారి సూచనలతో విద్వత్తు, సిద్ధాంతుల సభలో ముహూర్తం నిర్ణయించడం జరిగిందని, మహా సుదర్శన హోమం తోనే ప్రారంభం అవుతుందని తెలిపారు. సహస్రాశ్ట 1008 కుండలతో నిర్వహించడం జరుగుతుందని, 6 వేల మంది ఋత్విక్కులు పాల్గొంటారని, వివిధ పుణ్యక్షేత్రాల పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ దీవించాలని అన్నారు. హోమ్ కార్యానికి ఒక లక్షా యాభై వేల కిలోల కల్తీ లేని నెయ్యి వినియోగిస్తున్నట్లు తెలిపారు. అనేక లక్షల మంది భక్తులు వస్తారు, అనేక పనులు చేస్తే తప్ప నెరవేరదని, రేపటి నుండి మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. స్వామి వారి గర్భగుడి విమాన గోపురం స్వర్ణ తాపడంతో చేయించాలని నిర్ణయించామని, 125 కిలోల బంగారం అవసరమవుతుందని, ఈ కార్యం కోసం అందరూ సంతోషంగా ముందుకు వస్తున్నారని, 65 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. దీని కోసం గౌరవ ప్రజాప్రతినిధుల సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 12769 గ్రామపంచాయతీలు, 3600 వార్డులు, 142 మున్సిపాలిటీల ద్వారా అందరిని భాగస్వామ్యం చేయడం జరుగుతుందని, కమిటీ పర్యవేక్షణలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా బంగారంతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొట్ట మొదట స్వామివారికి విమాన గోపురానికి మా కుటుంబం నుండి ఒక కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని నాలుగు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, ప్రతి తండా నుండి పదకొండు రూపాయల చొప్పున ఇచ్చినా సంతోషమేనని అన్నారు. ఈ ఆలయం మనది అనే భావనతో అందరు స్వామివారి కార్యానికి ముందుకు రావాలని అన్నారు.

జర్నలిస్టులు వార్తావాహకులని, భక్తి పరంపరలో వారు స్వామివారి పుణ్యక్షేత్రం మహిమలు, విశేషాలను ప్రమోట్ చేయాలని కోరారు. ఈరోజు సంతోషంగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, 60 లక్షల ఎకరాలలో పంట రాబోతోందని అన్నారు. అలాగే ఒంటరి మహిళలకు పెన్షన్ లు, కులం జాతి అనేది లేకుండా అందరికీ సంక్షేమానికి ఏర్పాటు చేశామని, తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. జాతీయ అంతర్జాతీయంగా ఆకర్షించే విధంగా 250 కాటేజీల నిర్మాణం వెంటనే చేపడతాం అని తెలిపారు. కళ్యాణకట్ట , పుష్కరిణి పనులు వేగంగా పూర్తి చేస్తామని, అలాగే ఉచిత బస్సు కోసం బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, హైదరాబాద్ జలమండలి వారి సహాయంతో అండర్ డ్రైనేజీ, వర్షాకాలంలో నీరు వెళ్ళేలా రెండు రకాలుగా డ్రైనేజీ వ్యవస్థ వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని, దీనికోసం జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులకు కూడా జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి ఇండ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకుంటారని, చక్కని కాలనీ రూపుదిద్దుకుంటుందని తెలిపారు.


జర్నలిస్టులు దేవాలయ మార్పు చూసినవారు కాబట్టి వార్తా వాహకాలుగా ఆలయ వార్తలు, రాష్ట్ర విశిష్టతను చక్కటి పరిశోధన వ్యాసాలుగా అందించాలని సూచించారు. దళిత బిడ్డలకు నవంబర్ 4వ తేదీ తర్వాత దళిత బంధు పథకం ద్వారా వారి ఆర్ధిక ఉన్నతికి పది లక్షల రూపాయల సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. యాదాద్రి పై యాదర్షి ఋషి పేరుతో మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. అలాగే బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప సౌందర్య కన్వెన్షన్ సెంటర్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రికి.. మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భూరి విరాళం….
ఎంపీ రంజిత్ రెడ్డి ఒక కిలో బంగారం విరాళం
ఒక్కొక్కరు కిలో చొప్పున మొత్తం ఆరుగురు అరు కిలోల బంగారం
……………………………………….
ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్ఫూర్తి గా తీసుకున్న మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రికి భూరి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వారి కుటుంబ సభ్యులు కలసి కిలో బంగారం డొనేట్ చేస్తామని ప్రకటించారు. దీంతో మొత్తం ఆరుగురు అరు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు. ఒక గొప్ప కార్యక్రమంలో తాము సైతం భాగస్వాములం అవుతామని పేర్కొన్నారు. విరాళం ప్రకటించిన వారిలో ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్ ఉన్నారు..

యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు.
సీఎం కేసీఆర్.. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతోపాటు, పరిసరాలన్నింటినీ పరిశీలించారు. తొలుత మధ్యాహ్నం 12.40 గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు సీఎం కేసీఆర్ కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలశ్రీనివాస్ గుప్త, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.
అనంతరం కాన్వాయ్లో ఘాట్ రోడ్డు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అక్కడి నుంచి ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం కేసీఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందిస్తూ.. ‘‘ మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’’ అని ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయం గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్ర నామాలతో ఇండోర్ లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, చిత్రించిన తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు.

ఈ సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరగా, నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాం కనుక, ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయక, అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తరతరాలుగా క్షేత్రాన్ని ఆశ్రయించి బతుకుతున్న వారి బతుకుదెరువుకు ఎటువంటి భంగపాటు రానివ్వద్దని హెచ్చరించారు.
అనంతరం, చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని.. ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు. ఆలయ ప్రధాన అర్చకులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రిలో పది వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని వివరించారు.
‘‘మీకు పీఆర్సీ వస్తుందా ?’’ అని సీఎం కేసీఆర్ ఆలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ వస్తుందని వారు సమాధానమివ్వడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వివిఐపీ గెస్ట్ హౌజ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.

కలియతిరిగిన సీఎం కేసీఆర్
యాదాద్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సాయంత్రం కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణాలను పరిశీలించారు. తుది పనులపై పలు మార్పులు సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సుమారు 800 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించే ఒక్కో కాటేజీలో మొత్తం 4 సూట్లు ఉంటాయన్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీలను నిర్మిస్తుందన్నారు. దాతలు సూచించిన పేరును ఆ కాటేజీకి పెట్టుకోవచ్చన్నారు. మొత్తంగా దాదాపు వెయ్యి కుటుంబాలు బస చేసే ఈ సూట్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాటేజీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సరిపడా నీళ్లు, నిరంతర విద్యుత్తు, అన్నిరకాల వసతులు, హంగులు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని, టెంపుల్ సిటీ పరిధిలో మద్యపానం, ధూమపానం నిషేదాన్ని కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కేవలం శాఖాహారాన్ని మాత్రమే అనుమతించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

యాదాద్రిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వీవీఐపీలు బస చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వీక్షకుల లాంజ్ నుంచి.. బంగారు వర్ణంలో కాంతులీనుతున్న ఆలయ గోపురాలను ముఖ్యమంత్రి తాదాత్మ్యంతో తిలకించారు. ఆ సూట్ పై నుంచి చూస్తే.. విద్యుద్దీప కాంతులతో ధగధగ వెలిగిపోతున్న యాదాద్రి ఆలయాన్ని, నందనవనంలాగా కనిపిస్తున్న పచ్చదనం దృశ్యాలను చూసి.. సీఎం కేసీఆర్ తో సహా వెంట ఉన్నవారందరూ పులకించిపోయారు. అక్కడి నుంచి మళ్లీ ఆలయం ప్రాకారం దగ్గరకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి, లైటింగ్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. పలు సూచనలను చేశారు.






