ఆపద మొక్కుల వాడిగా వెంకటాపురం నరసింహుడికి పేరుంది. పురాణకాలంలో వెంకటాపురం గిరిపై రుషులు తపస్సు చేసినట్లు, దానికి మెచ్చిన శ్రీలక్ష్మీనరసింహుడు జ్వాలారూపంలో వారికి దర్శనమిచ్చినట్లు పురాణాల ఆధారంగా తెలుస్తోంది. తుర్కపల్లి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇరుకైన కొండగుహలో జ్వాలా నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. యాదగిరిగుట్టకు పది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది. యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుడు అలసి సొలసి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాడని కొంతమంది భక్తుల నమ్మకం. ఎంతో పురాతనమైన ఆలయాన్ని చేరుకోవడానికి యాదాద్రి నుంచి ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి.